సుప్రీంకోర్టు వెలుపల న్యాయవాదుల నిరసన ప్రదర్శన
న్యూఢిల్లీ
ఈనెల 2వ తేదీన తీస్ హజారి కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు వెలుపల సోమవారంనాడు నిరసన ప్రదర్శన చేపట్టారు. లాయర్లకు రక్షణ కల్పించాలని, లాయర్ల పరిరక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.'గాయపడిన అడ్వకేట్లకు ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలి. తక్షణం లాయర్ల పరిరక్షణ చట్టం అమలు చేయాలి' అని సుప్రీంకోర్టు వెలుపల నిరసనల్లో పాల్గొన్న లాయర్ ఒకరు డిమాండ్ చేశారు. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఘటనకు ఈ ఘటన ఏమాత్రం తీసిపోదని, అడ్వకేట్లపై అతిసమీపం నుంచి పోలీసులు కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. వాస్తవాలేమిటో మీడియా చూపించాలని, తీవ్రంగా గాయపడిన ఒక అడ్వకేట్ చావుబతుకుల్లో ఉన్నాడని ఆయన తెలిపారు. తీస్ హజారీ కోర్టు ఘటనకు నిరసనగా దేశంలోని అన్ని కోర్టులు ఇవాళ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని, తీస్ హజారీ కోర్టు అడ్వకేట్లకు సుప్రీంకోర్టు లాయర్లు కూడా సంఘీభావం తెలిపారని మరో న్యాయవాది తెలిపారు.కాగా, పలువురు న్యాయవాదులు గాయపడటానికి దారితీసిన తీస్ హజారీ ఘటనపై న్యాయవిచారణకు ఢిల్లీ హైకోర్టు ఇంతకుముందు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎస్పీ గార్గ్ ఈ విచారణను చేపట్టి ఆరువారాల్లోగా నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు, తీస్ హజారీ ఘటనలో గాయపడి ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఇద్దరు లాయర్లకు చెరో 2 లక్షల రూపాయలు, గాయపడిన లాయర్లకు రూ.50,000 చొప్పున సాయం చేసేందుకు ఢిల్లీ బార్ కౌన్సిల్ నిర్ణయించింది.