తాజా వార్తలు
పాలసీదారులకు ఎల్ఐసీ గుడ్న్యూస్
న్యూదిల్లీ: జీవిత బీమా పాలసీ తీసుకున్నా.. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల దాన్ని కొనసాగించలేకపోతారు కొందరు. దీంతో ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. కొన్నాళ్ల తర్వాత జీవిత బీమా తీసుకోవాలని భావించినా మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సిందే. అలాంటి వారికి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ శుభవార్త చెప్పింది. పాలసీ ల్యాప్స్ అయ్యి రెండేళ్లు పూర్తయినా దాన్ని మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.చెల్లించని తొలి ప్రీమియం గడువు నుంచి రెండేళ్ల వరకు మాత్రమే ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వీలు గతంలో ఉండేది. 2014 జనవరి 1కి తర్వాత ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. తాజాగా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ఉండాలన్న ఉద్దేశంతో ఐఆర్డీఏఐతో సంప్రదించి.. దీర్ఘకాలంపాటు పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పించింది. తాజా సదుపాయం కింద ఐదేళ్లలోపు నాన్ లింక్డ్ పాలసీలకు, మూడేళ్లలోపు యూనిట్ లింక్డ్ పాలసీలకు పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. అంటే 2014 జనవరి 1 కంటే ముందు తీసుకున్న పాలసీలను కూడా పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ తెలిపింది. జీవిత బీమా అనేది వ్యక్తి తెలివైన ఎంపిక అని, తమ పాలసీదారులు జీవిత బీమాను కొనసాగించేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్ తెలిపారు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ప్రీమియం చెల్లించలేని వారు బీమాకు దూరమై పాత పాలసీని కొనసాగించలేక, కొత్త పాలసీ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. ఈ పునరుద్ధరణ సదుపాయం పాలసీదారులకు అద్భుత అవకాశమని పేర్కొన్నారు.