YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తదుపరి కార్యాచరణపై జేఏసీ నేతల మంతనాలు

తదుపరి కార్యాచరణపై జేఏసీ నేతల మంతనాలు

తదుపరి కార్యాచరణపై జేఏసీ నేతల మంతనాలు
హైద్రాబాద్, 
ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా.. మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు కార్మికులకు నచ్చజెప్పినా 300 మంది కూడా విధుల్లో చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి విమర్శించారు. చేరిన వారికి డ్యూటీలు వేసే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. కార్యాలయ సిబ్బందిలో కొంత మంది విధుల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్సీఎన్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో బీజేపీ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. లక్ష్మణ్‌ ఢిల్లీ పర్యటనలో జాతీయ నాయత్వంతో ఆర్టీసీ సమ్మెపై చర్చించిన అంశాలు, భవిష్యత్‌ కార్యాచరణ, మిలియన్‌ మార్చ్‌ నిర్వహణ తదితర అంశాలపై నేతలు ప్రధానంగా చర్చలు జరిపారు.నవంబర్ 9న ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ తరహాలో జరిపే నిరాహార దీక్షలకు మద్దతివ్వాలని బీజేపీని కోరినట్లు అశ్వత్థామ రెడ్ది తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పెన్‌ డౌన్‌ చేయాలనే విజ్ఞప్తికి ప్రభుత్వ ఉద్యోగులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.విధుల్లో చేరకుండా సమ్మెకు సహకరించిన కార్మికులకు అశ్వత్థామ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీ స్వరూపాన్ని మార్చడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.‘కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే కుదరదు. కోర్టులు ఉన్నాయి. మేం సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లం. కార్మికులెవరూ భయపడొద్దు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గుర్తింపు సంఘం ఆమోదం తీసుకోవాలని చట్టంలో ఉంది’ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు.
సీపీఐ నేతల అరెస్ట్
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ దాటుకుని పరుగులు పెడుతోంది. బుధవారం అన్ని బస్‌ డిపోల ముందు నిరాహార దీక్షలు చేపట్టాలన్న ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపు మేరకు కార్మికులు, వామపక్ష నాయకులు కదం తొక్కారు. ముషీరాబాద్‌ బస్‌ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ సీఎం కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడకుండా.. చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు.ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ డెడ్‌లైన్‌ పెట్టాడు. బెదిరించాడు. అయినా 50 వేల మంది కార్మికుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరిన వాళ్ళలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చూస్తూ ఊరుకోలేక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే... కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులను నడిపితే ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకుంటారు. అవసరమైతే తగులబెడతారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వపరం చేసి చూపించారు. ఇక్కడెందుకు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలి’అని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెను ఉధృతం చేయడంతో బస్‌ డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు పాట్లు తప్పడం లేదు.

Related Posts