YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

కార్తీక పురాణం - 10  10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. 

కార్తీక పురాణం - 10  10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. 

కార్తీక పురాణం - 10  10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. 
జనక ఉవాచ: 'వశిష్ఠా! ఈ  అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన యిలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూత లెందుకూరుకున్నారు? వాళ్లు యమునికి యేమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.'
విశిష్ట ఉవాచ : నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి యిలా చెప్పసాగారు.
యమదూతల ఆరోపణము - యముని ఉపదేశము 
'అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో - విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను యెదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము' అని  కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి  జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై - కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి - ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త  పాపాలనూ నశింపచేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని  పోబడ్డాడు. తెలిసి తాకినా - తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్నిదహించునో అదే విధముగా - దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా - ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తిభావముతో స్మరించినవారు కేవలము కైవల్య పథగాములే అవుతారు' అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి - యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.
అజామిళుని పూర్వజన్మ 
అజామిళుడు అతని  పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరనాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవద్రవ్యాపహరి అయి వుండేవాడు. బ్రహ్మణుడయివుండి కూడా ఆయుధపాణియై, దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయివుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు, అతడు దరిద్రపీడితుడై- అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ - యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు  తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకునివచ్చి భార్యను పిలిచి - 'చాలా  ఆకలిగా  వుంది. సత్వరమే వంటచేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను' అన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ యిల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు.
తన  కామపు ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీవున్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు. మగడు యిల్లువదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి - మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ - ఒకానొక రజకుని యింటికి వెళ్లి - ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు. ఆమె కోరిన తప్పుడుపనికి అంగీకరించకపోవడంతో - వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ - పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి - సురత క్రీడలకాహ్వానించింది. బ్రహ్మణుడైన వీడు - ఆమె పరస్త్రీ అని  కూడా ఆలోచించకుండా - అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై - భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది  మొదలుగా అతని మాటలకు 'తు-చ' తప్పకుండా బ్రతుకసాగింది.
ఇటువంటి పాపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాల ననుభవించి, అనుభవించి - సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి - కార్తీక పౌర్ణమినాటి శివసందర్శనం - అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.
ఆనాటి శివార్చకుని జన్మలో - ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిణి కూడా కొంతకాలానికి మరణించి, నరకానుభవమును పొంది - కన్యాకుబ్దములోని ఛండాల  గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ - పిల్ల - తండ్రి గండాన పుట్టడం వలన - వాళ్లా  పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియైన ఒకా బ్రహ్మణుడా బాలిక  అరణ్యరోదన విని, జాలిపడి, తనతో తీసికొని వెళ్లి, తన యింటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీదాని దగ్గర  పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకూ హరినామా స్మరణ కన్నా  మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వుంటుంది.
జనక నరపాలా! ఎవరిజిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల నాశ్రయించదో, ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనల నాలకించవో వాళ్ల  పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్ణువునే ధ్యానిస్తూ వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు! మోక్షాసక్తులను మురహరి స్మరణ మేవిధంగా  సూక్ష్మమార్గమో - అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా  మహొత్కృష్ట పుణ్యప్రదాయినియై - పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసేశక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే  వుండడము వలన, ఎవరైతే ఈ దివ్వవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెల్సుకో. పాపనాశనియైన ఈ కార్తీక మహత్మ్యన్ని శ్రద్దా భక్తులతో వినినప్పటికీ కూడా - వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైనవారికి - పావన హృదయంతో యీ మహత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే దశమోధ్యాయ స్సమాప్త:
 

   

Related Posts