YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం... సంచలన తీర్సు చెప్పిన ధర్మాసనం

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం... సంచలన తీర్సు చెప్పిన ధర్మాసనం

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం...
సంచలన తీర్సు చెప్పిన ధర్మాసనం
న్యూఢిల్లీ, నవంబర్ 13,
దశాబ్దాల అయోధ్య భూ వివాదంపై సంచలన తీర్పును వెలువరించిన నాలుగు రోజుల తర్వాత సుప్రీంకోర్టు బుధవారం మరో కీలక తీర్పును వెలువరించింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందంటూ తీర్పు స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందా? అని ప్రశ్నిస్తూ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని 2010 జనవరిలో తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా తుదితీర్పును వెలువరించింది. ఏప్రిల్‌ 4న విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచిన తర్వాత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పారదర్శకత లేని వ్యవస్థను ఎవరూ కోరుకోరు కానీ, పారదర్శకత పేరుతో న్యాయ వ్యవస్థను నాశనం చేయకూడదని ముగింపు సమయంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు సహా జడ్జ్‌ల నియామకానికి సంబంధించి కొలీజియం, కేంద్రానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను తెలియజేయాలని కోరుతూ 2007లో సుభాష్ చంద్ర అగర్వాల్ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, ఈ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించిన ఆయన.. సీజేఐ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారు కాబట్టి సమాచారాన్ని వెల్లడించాల్సిందేనంటూ సుప్రీంకోర్టుకు చెప్పాలని అభ్యర్థించారు.సుభాష్ చంద్రకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిన కేంద్ర సమాాచార కమిషన్.. గుర్తుతెలియని వ్యక్తుల చొరబాటు నుంచి న్యాయవ్యవస్థలకు స్వేచ్ఛ కల్పించాలన్న సుప్రీం విన్నపాన్ని తిరస్కరించింది. దీంతో వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరగా అక్కడ కూడా హక్కుల కార్యకర్తకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సీజేఐ ఆస్తుల వెల్లడి వ్యక్తిగత సమాచారం కిందకు వస్తుందని దాన్ని వెల్లడించలేమని వాదనలు వినిపించారు. అయితే, ఈ వాదనలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ పొల్యూషన్ పై సుప్రీం సీరియస్ రాజధానిలో వాయు కాలుష్యం పెరగడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీ వాయు కాలుష్యంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌.. హైడ్రోజన్‌ ఇంధన ఆధారత వాహానాల టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు. అంతేగాక వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై డిసెంబర్‌ 3 నాటికి నివేదిక ఇ‍వ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. 

Related Posts