చంద్రయాన్-3 మూడో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో
బెంగళూరు,
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్ సిరీస్లో మూడో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా కొత్తగా తయారు చేసే ల్యాండర్, రోవర్ను నవంబర్ 2020లోపు చంద్రునిపై మృదువుగా దింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. చంద్రయాన్ 2 ప్రయోగం చివరి దశలో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మృదువుగా దిగే సందర్భంలో సాంకేతిక సమస్య తలెత్తి సెప్టెంబర్ 7న కుప్పకూలడం తెలిసిందే. దీంతో పొరపాట్లను విశ్లేషించి ఆ సమస్యలు చంద్రయాన్ 3లో పునరావృతం కాకుండా నిపుణుల కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ప్రయోగం కోసం విక్రవ్ు సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ సోమనాథ్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించారని.. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చంద్రయాన్ 3 ప్రయోగం జరుగనుందని ఇస్రోలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అనుమతి వచ్చాకనే చంద్రయాన్ 3 ప్రయోగంపై అధికారిక ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ 2లో ఆర్బిటార్ విజయవంతంగా పనిచేస్తున్నందున చంద్రయాన్ 3లో ఆర్బిటార్ లేకుండా ల్యాండర్, రోవర్ను ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో తలపెట్టిన ఆదిత్య ఎల్ 1, గగన్యాన్ ప్రయోగాల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నది.