YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యత

నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యత

నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యత
పథకాల అమలుకు ప్రమాణం సంతృప్త స్థాయిలో అమలు చేయడమే జిల్లాల పర్యటనలో ఇచ్చిన హామీలు అమలు కావాల్సిందే
సమీక్షా సమావేశంలో సీఎం  వైయస్.జగన్ మార్గదర్శక సూత్రాలు
అమరావతి నవంబర్ 22
నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం  వైయస్.జగన్ స్పష్టంచేశారు. సంతృప్తస్థాయిలో వీటిని అమలు చేయడంపైనే ప్రభుత్వం ప్రధాన దృష్టి ఉంటుందని పునరుద్ఘాటించారు. శాఖల్లో అనవసర వ్యయాలకు కళ్లెం వేస్తూ, సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలను పెంచుకోవాలని నిర్దేశించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు, జిల్లాల పర్యటనల సందర్భంగా చేసే వాగ్దానాలను క్షేత్రస్థాయిలో తప్పకుండా అమలు చేయాలన్నారు. కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను వీలైనంత తెచ్చుకోవడానికి గట్టిగా కృషిచేయాలని, దీనికోసం సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ అంశాలను మార్గదర్శక సూత్రాలుగా తీసుకొని పరిపాలనలో ముందుకుసాగాలని ముఖ్యమంత్రి  వైయస్.జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ‘‘రచ్చబండ’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం  వైయస్.జగన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, వీటికి వస్తున్న నిధులు, అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపైన అధికారులతో క్షుణ్నంగా చర్చించారు. రానున్న కాలంలో ఎలా నడవాలన్న దానిపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనవసర వ్యయం వద్దు.:గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయిందని, నాలుగు వేల కోట్లో, ఐదువేల కోట్లో బిల్లులు పెండింగులో పెట్టిందంటే... సరేలే అనుకునేవాళ్లమని, కాని ఏకంగా రూ.40వేల కోట్ల రూపాయల  బిల్లులను పెండింగులో పెట్టారని సీఎం అధికారులతో అన్నారు. కార్పొరేషన్ల పేర్లమీద వేలాది కోట్లు అప్పులు తెచ్చి.. పౌరసరఫరాలు వంటి కీలక కార్పొరేషన్ల మనుగడనే ప్రశ్నార్థకం చేశారని, అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామంటూ ఆర్థిక పరిస్థితులను సీఎం అధికారులకు వివరించారు. గడచిన 6 నెలల కాలంలో ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యహరిస్తూ ముందుకు వెళ్తున్నామని, కఠిన పరిస్థితులనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ సమయంలో వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టాలని, ఒక్కపైసా కూడా ఎక్కడా వృథాకాకూడదని ఆదేశాలు ఇచ్చారు. ప్రాధాన్యతాంశాలపై ఫోకస్పెట్టకపోతే ప్రయోజనం ఉండదన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు పెంచుకునే మార్గాలపైనా ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.నవరత్నాలే ప్రధమ ప్రాధాన్యత:ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాలే ప్రభుత్వ ప్రాధాన్యతలని సీఎం స్పష్టంచేశారు. అధికారులందరూ కూడా మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని వాటిని అమలు చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో మేనిఫెస్టోద్వారా చెప్పకనే చెప్పామన్నారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్రలో రాష్ట్రంలోని వివిధ వర్గాలనుంచి, ప్రజలనుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని అధ్యయనం చేసి మేనిఫెస్టోను తయారుచేశామన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని, ఏదో ఒకటి పెడదాంలే అన్నరీతిలో మేనిఫెస్టోని తయారుచేయలేదని, క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితులకు, వెనకబడ్డ వర్గాల వేదనల  నుంచి ఈ మేనిఫెస్టో వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నరవత్నాలతోపాటు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేయాలన్నారు. ఈ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్)లో అమలు చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని సీఎం స్పష్టంచేశారు. ప్రతి పథకానికీ సంతృప్తిస్థాయిలో అమలుచేయడమే ప్రమాణం కావాలన్నారు. ఉన్న నిధులను సరైన దృష్టి లేకుండా అక్కడ కొంత, ఇక్కడ కొంత చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. చేపట్టే ప్రతి పనీ కూడా ఈ ప్రభుత్వం నూటికి నూరుశాతం చేస్తుందన్నదే మార్గదర్శకసూత్రం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎన్నిక కావడమన్నదే మైలురాయి అవుతుందని, ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చి వారికి మేలు చేసినప్పుడే అది నెరవేరుతుందని సీఎం చెప్పారు.

Related Posts