మాజీ ఎమ్మెల్యే కుమారుడు కాలువలో గల్లంతు
గుంటూరు
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే దొందేటి కృష్ణారెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి ప్రమాదవశాత్తు ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్ లో స్నానానికి దిగి గల్లంతైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆరేపల్లి గ్రామంలో ఉన్న తన పంట పొలాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకుగాను అనిల్ రెడ్డి సోమవారం బయలుదేరారు. కార్తీక మాసం చివరి రోజు, చివరి సోమవారం కావటంతో దగ్గరలో ఉన్న సాయిబాబా దేవస్థానంలో పూజలు చేయించుకొనే ఉద్దేశంతో మార్గమధ్యంలో ఉన్న బ్రాంచి కెనాల్ వద్ద కు చేరుకున్నారు. బ్రాంచి కెనాల్ మెట్ల మీద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి గల్లంతైనట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అనిల్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.