YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ దేశీయం

 వెటర్నరీ డాక్టర్ కుమద్దతుగా నిలుస్తున్న దేశం

 వెటర్నరీ డాక్టర్ కుమద్దతుగా నిలుస్తున్న దేశం

 వెటర్నరీ డాక్టర్ కుమద్దతుగా నిలుస్తున్న దేశం
హైద్రాబాద్, నవంబర్ 30, 
వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నలుగురు మృగాళ్లు తోడేళ్లలా దారి కాచి నిస్సహాయురాలైన ఓ యువతిపై విరుచుకుపడి అఘాయిత్యానికి ఒడిగట్టిన తీరు కంటతడి పెట్టిస్తోంది. ఆ కాళరాత్రి ఆమె అనుభవించిన నరకాన్ని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆడబిడ్డల వెన్నులో వణుకు పుడుతోంది. నెత్తురు మరిగించే నేరమిది. గుండెలవిసే ఘోరమిది. తెలంగాణ ఆడపడచుకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని యావత్ దేశం కంటతడి పెడుతోంది.. ఆమె దారుణ హత్యోదంతాన్ని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఖండిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులందరూ ఈ దారుణంపై స్పందించారు. రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలి హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ర్యాలీలు చేపట్టారు. జాతీయ మహిళా కమిషన్ ఈ హత్యోదంతాన్ని తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.ఇక దారుణ హత్య జరిగిన షాద్‌నగర్‌లో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి.. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు, అమ్మాయిలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..వైద్యురాలి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి షాద్‌నగర్‌ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ, నిందితులు పోలీస్ స్టేషన్‌లో ఉన్న విషయం తెలుసుకొని అక్కడ ప్రజా సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యువకులు, మహిళలు భారీగా చేరుకున్నారు. ఆ రాక్షసులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనతో పోలీస్ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.నిందితులను బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏరియా హాస్పిటల్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జడ్జీలు అందుబాటులో లేకపోవడంతో నిందితులను ఎగ్జిగ్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ తహశీల్దార్‌ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆ రాక్షసులను మాకు అప్పగించండి అంటూ నిరసనకారులు పోలీస్ స్టేషన్‌‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీస్ స్టేషన్ గేట్లకు తాళాలు వేశారు.

Related Posts