అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం
కడప డిసెంబర్ 03,
సీఎం జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ మరింత అప్పుల్లో కూరుకు పోయిందని ఆయన ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డి కేవలం ఆరు నెలల పాలనలో రూ.28 వేల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి లెక్క చెప్పారు.జగన్ ఆరు నెలల పాలన పై నిప్పులు చెరిగిన తులసిరెడ్డి ఏపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1951 నుంచి 2014 వరకు కేవలం లక్ష కోట్ల రూపాయల అప్పులు మాత్రమే అయ్యాయన్నారు.2014 నుంచి 2019 వరకూ మరో 1.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారన్నారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పరిపాలన లోకి వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలో 28 వేల కోట్ల అప్పులు చేశారని ఆయన మండిపడ్డారు.దుబారా ఖర్చులు తగ్గిస్తామంటూనే తెలంగాణలోని లోటస్పాండ్లోని గృహానికి రూ.35 లక్షల నిధులు ప్రశ్నించారని పేర్కొన్నారు తులసి రెడ్డి. అలాగే విజయవాడలోని ఇంటికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ జీవోలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆడింది ఆట, పాడింది పాటగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగాల్లో దాదాపు 40వేల మంది ఓసీ పేద యువతకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు