పాలన చేత కాకపోతే.. ఎన్నికలకు వెళదాం
తిరుపతి, డిసెంబర్ 3,
ఉల్లి రేట్ల విషయంలో ప్రభుత్వ నిర్వహణా లోపం ఉందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని.. నిత్యావసర వస్తువైన ఉల్లిపాయల రేట్లు ఇలా పెరిగితే ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. మంగళవారం తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. ఆర్బీ రోడ్డులో ఉన్న రైతు బజారును సందర్శించారు. స్థానికులు, వ్యాపారుల సమస్యలపై ఆరా తీశారు.ప్రభుత్వం ఎంతసేపు ఇళ్లు పగలగొడదామా.. కాంట్రాక్ట్లు రద్దు చేద్దామా అనే తప్ప.. ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన లేదన్నారు పవన్. ఉల్లి రేట్లు భారీగా పెరిగిపోయాయని.. ప్రభుత్వం సబ్సిడీ కింద ఉల్లిపాయల్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు బజార్లో కిలో ఉల్లిపాయలు రూ.25కే ఇస్తామని చెబుతున్నా అమలు జరగడం లేదని ఆరోపించారు.ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టదన్నారు జనసేనాని. గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన.. ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చే సమర్ధత లేకపోతే ప్రభుత్వం తప్పుకొని ఎన్నికలకు వెళ్లాలి అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు నిన్న అన్నం తిన్నామని.. ఇవాళ మానేయరు కదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఇసుక కొరతలానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు పవన్ కళ్యాణ్. ఒక వైపు రెక్కలు ముక్కలు చేసుకున్న రైతులకు గిట్టుబాటు ధరలు లేదని.. రైతు బజారులో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారని.. ఇదంతా చూస్తే మధ్యలో దళారులు బాగుపడుతున్నారు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కిలో సబ్సిడి ఉల్లిపాయల కోసం మహిళలు రోజంతా క్యూలైన్లో ఉండిపోవాల్సి రావడం బాధకరమన్నారు పవన్. రూ. 25 దొరకాల్సిన ఉల్లిపాయలు... రూ.100కి అమ్మితే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.