ముసలి కోతి పోయి పిల్ల కోతి వచ్చింది
ఏ కోతి ఐతేనేమి ఏపీని చెడపడానికి
రాష్ట్రం నాశనం కావడానికి కారణం చంద్రబాబు, జగన్ లే..
సీమ అభివృద్ధి కోసమే బీజేపీలోకి...
ప్రాంతీయ పార్టీల పతనం తప్పదు...
కర్నూలు డిసెంబర్ 4,
ఆంద్రప్రదేశ్ అనే వనాన్ని గత 5 సంవత్సరాల్లో ఒక ముసలి కోతి సగం చెడిపితే ఇప్పుడు మరో పిల్ల కోతి మిగతా వనంను చెడిపేందుకు వచ్చిందని బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు, జగన్ తీరుపై తీవ్రగా మండి పడ్డారు. ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమార్తె బైరెడ్డి శబరీలు కర్నూలుకు విచ్చేసారు. ఈ సందర్భముగా వారికి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పుల్లూరు టోల్ ప్లాజా నుంచి భారీ కాన్వాయి, మోటార్ బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. గతంలో ఒక తుగ్లక్ పాలనను మరువక ముందే మరో తుగ్లక్ పాలనను ప్రజలు చూస్తారని ఊహించలేదన్నారు. ఇసుక కొరత వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రభుత్వ ఆస్తులను అంమెందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి పిచ్చి చేష్టలను మనుకోవలన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కర్నూలులో ఇండిపెండెన్స్ డే రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారూ. పైగా ప్రస్తుతం విస్తృత స్థాయి సమావేశాలంటూ కర్నూలులో మూడు రోజులు బాబు పర్యటన చేయడం సిగ్గు చేటన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ జగన్ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం బాధకరం అన్నారు. ఇదిలా ఉండగా తాను బీజేపీ పార్టీలోకి చేరడానికి నరేంద్రమోడీ యొక్క దేశభక్తియే కారణమన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి దేశాభివృద్ధి చేస్తున్న మోడీతోనే సాధ్యమన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ బలపడుతుందని, మోడీ దెబ్బకు ప్రాంతీయ పార్టీల పతనం తప్పదని హెచ్చరించారు.