పోలీసులకు అభినందనలు : బీజేపీ నేతలు
హైద్రాబాద్, డిసెంబర్ 6,
దిశ మర్డర్ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డమ్మీ హోం మినిస్టర్, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి పనిచేయకపోయినా, పోలీసులు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని కొనియాడారు. నిందితులు తప్పించుకునే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని సీపీ సజ్జనార్ చెబుతోన్న కారణాలను విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడం మంచి పరిణామమని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆడ వాళ్లపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిన వారికి శిక్షలు ఈ స్థాయిలోనే ఉండాలని అన్నారు. తెలంగాణ పోలీసులను ఎంతో మంది తిట్టారని, అందులో తాను కూడా ఒకడినని గుర్తు చేశారు. ‘‘నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు పోలీసులకు సెల్యూట్. మన పోలీసులను చూసి ప్రతీ రాష్ట్రం నేర్చుకోవాలి. దేశ వ్యాప్తంగా ఎన్నో ఈ రకమైన దారుణాలు జరుగుతున్నాయి. ప్రతి ఘటనలో పోలీసులు ఇలా ముందుకెళ్తే మహిళలపై దౌర్జన్యాలు తగ్గిపోతాయి. ఈ ఎన్కౌంటర్పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విచారణ చేయించాలంటున్నారు. ఇందులో ఏ విచారణ అవసరం లేదు. తెలంగాణ పోలీసులు దేనికీ భయపడక్కర్లేదు. ఎందుకంటే, యావత్ భారతం మీ వెంటే ఉంది.’’ అని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. నిందితులైన మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో వెంటనే చనిపోయారు. చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న నిందితులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. గురువారం అర్థరాత్రి దాటాక జైలు నుంచి వీరిని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.నేరం జరిగిన చోట పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని తొండుపల్లి టోల్గేట్ దగ్గరకు గురువారం అర్ధరాత్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి దిశను పెట్రోల్ పోసి కాల్చిన చటాన్పల్లి స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. నిందితులు రాళ్లు రువ్వినందునే పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ధ్రువీకరించారు.