YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

హాజీపూర్ బాధితుల ధర్నా

హాజీపూర్ బాధితుల ధర్నా

హాజీపూర్ బాధితుల ధర్నా
నల్గొండ, డిసెంబర్ 7  
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్న బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఆ రాక్షసులను కూడా ఇదే రీతిలో ఎన్‌కౌంటర్ చేసి తీరాలని పట్టుబడుతున్నారు. కొన్ని నెలల క్రితం తెలంగాణలో హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈయన కామ దాహానికి బలైన బాధిత యువతుల కుటుంబాలు శ్రీనివాస్ రెడ్డిని కూడా తక్షణం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.ఓ వైపు దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో అందరూ ప్రభుత్వాన్ని కీర్తిస్తుంటే.. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో ఇంతవరకూ ఏమీ చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిశ నిందితుల మాదిరిగానే హాజీపూర్‌ ఘటనలోనూ పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శ్రీనివారెడ్డిని శిక్షించాలని కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్థులు సమావేశమయ్యారు.శ్రీనివాస్ రెడ్డి రాక్షసత్వం బయటపడి 8 నెలలు అవుతున్నా విచారణ పేరుతో బాగా జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపిన మాదిరిగానే కామాంధుడైన శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ లేదా ఉరిలో ఏదో ఒకటి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వల్ల కాకపోతే నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని తమకు అప్పగించాలని, తామే శిక్షించుకుంటామని ఆందోళనకు దిగారు. దిశ తల్లిదండ్రుల మాదిరిగానే తమది కడుపు కోత కాదా? అని బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డిని చంపితే తమ పిల్లల ఆత్మ కొంతైనా శాంతిస్తుందని అన్నారు. శ్రీనివాస్‌ను శిక్షించే విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పలువురు గ్రామపెద్దలను అదుపులోకి తీసుకొని భువనగిరి జోన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో పదో తరగతి విద్యార్థిని శ్రావణిని శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం, హత్య చేశాడు. ఈ ఘటన గత ఏప్రిల్‌ 25న జరిగింది. ఈ కేసు విచారణ సమయంలో శ్రీనివాస్ రెడ్డి గతంలో మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా ఇదే రీతిలో హతమార్చినట్లు తేలింది. ఈ మేరకు కల్పన, మనీషా అనే బాలికలను హత్య చేసి, మృత దేహాలను బావిలో దాచినట్లుగా ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నాడు. ఆగ్రహించిన గ్రామ ప్రజలు ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు.

Related Posts