YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

రేప్ లకు రాజధానిగా భారత్ : రాహుల్

రేప్ లకు రాజధానిగా భారత్ : రాహుల్

రేప్ లకు రాజధానిగా భారత్ : రాహుల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7, 
దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, పెరిగిపోతున్న హింసకు బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో శనివారం పర్యటించిన ఆయన మాట్లాడుతూ... భారత్ అత్యాచారాలకు రాజధానిగా మారిపోతుందని, దేశంలోని మహిళలను ఎందుకు కాపాడలేకపోతున్నారని విదేశీయలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. దేశంలో మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని రాహుల్‌ విమర్శలు గుప్పించారు.వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని.. కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. హింస, విచక్షణారహిత విధానాల్ని విశ్వసించే వ్యక్తి ఈ దేశాన్ని పాలించడమే వీటన్నింటికీ కారణమంటూ తీవ్రస్థాయిలో మోదీపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడితే ప్రధాని నరేంద్ర మోదీ నోరువిప్పి ఒక్క మాట్లాడరని రాహుల్ ధ్వజమెత్తారు.దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే.ఉన్నావ్ బాధితురాలి మరణంపై ట్విట్టర్‌లో స్పందించిన రాహుల్.. ‘ఉన్నావ్‌ ఘటన హృదయాన్ని కలచివేసిందని, ఓ అమాయక మహిళ మరణించడం విచారకరం.. మానవత్వానికి సిగ్గుచేట్టుగా ఘటన ఇది.. న్యాయం, భద్రత కోసం ఎదురుచూస్తున్న మరో కుమార్తెను ఈ దేశం కోల్పోయింది. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లక్నో పర్యటనలో ఉన్న ఆమె.. బాధితురాలి మృతి వార్త తెలియగానే హుటాహుటిన ఉన్నావ్‌ చేరుకుని, బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ఏడాది కాలంగా బాధితురాలి కుటుంబం వేధింపులు ఎదుర్కొంటోందని, నిందితులకు బీజేపీ నేతల అండదండలు ఉన్నాయని ఆరోపించారు.రాష్ట్రంలో నేరస్థులు ఎలాంటి భయం, జంకు లేకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో నేరస్థులకు చోటు లేదని సీఎం చెబుతున్నారు. కానీ ఇక్కడ మహిళలకే చోటు లేకుండా పోతోంది’ అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో శాంతి భద్రతలు లోపించాయని, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు న్యాయం జరగట్లేదని ఆమె ఆరోపించారు.

Related Posts