కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వానికి ఢోకా లేనట్లే కనిపిస్తోంది. 15 శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి అవసరమైన 7 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు.తాజా సమాచారం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండింటిలోనూ, జేడీఎస్ ఒక స్థానంలోనూ ఆధిక్యత కనబరుస్తున్నాయి.ఇదిలావుండగా, విజయనగరలో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ 75 ఓట్ల ఆధిక్యంలో ఉంది. స్వతంత్రంగా పోటీ చేసిన బీజేపీ రెబల్ అభ్యర్థి కూడా ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలో 17 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాలకు ఇతర కారణాలతో ఉప ఎన్నికలను నిర్వహించలేదు. 15 స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలున్న శాసన సభలో బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల బీజేపీ ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే అదనంగా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. తాజా సమాచారాన్ని బట్టి యడియూరప్ప ప్రభుత్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.