ఆశల పల్లకీ (నల్గొండ)
నల్గొండ, డిసెంబర్ 09: యాభై ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందని జిల్లా రైతులు ఆశపడుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, రైతుల గోడు విన్న ప్రభుత్వం ఎట్టకేలకు రైతులపై ఉన్న ఎత్తిపోతల భారం తొలగించాలని నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్నగర్లో జరిగిన కృతజ్ఞతా సభలో ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని 49 ఎత్తిపోతలకు ఏటా రూ.4.50 కోట్లు నుంచి రూ.5 కోట్లు ఇస్తే నిర్వహణ చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో 1969 అక్టోబర్ 2నే తొలి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. కాలక్రమేణా సాగర్ ఎడమ కాల్వపై 49 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. నాటి నుంచి కొంతకాలం రైతులే వాటిని నిర్వహించుకున్నారు. తర్వాత ఐడీసీకి నిర్వహణ బాధ్యత అప్పగించారు. విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీతాలు, మోటర్ల నిర్వహణ అంతా మోయలేని భారంగా మారి ఎత్తిపోతలు మూలన పడే స్థితికి వచ్చాయి. ఆ తర్వాత ఎన్నెస్పీకి అప్పగించి కొన్ని నిధులు మంజూరు చేసి మోటర్లు, పంపులు, విద్యుత్తు పనులు చేయించారు. అయినా వీటిని పూర్తిస్థాయిలో నడిపించలేకపోయారు. ఆరంభంలో రైతుల నుంచి బస్తా ధాన్యం తీసుకునే వారు తర్వాత ఎకరానికి రూ.1500 వసూలు చేశారు. ఇపుడు రూ.500 వసూలు చేస్తున్నారు. ఇందులో అందరూ చెల్లించకపోవడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెక్కల్లో సైతం తేడాలున్నాయని పలుచోట్ల ఆరోపణలు వచ్చాయి. రైతులకు ఎత్తిపోతల భారం తొలగించాలని 2001లో కేసీఆర్ కోదాడ నుంచి సాగర్కు పాదయాత్ర చేశారు.ఏటా 49 ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఎత్తిపోతల నిర్వహణకు మోటర్ ఆపరేటర్లు, వీటిని నిర్వహించేందుకు లస్కర్లు, రాత్రి కాపలాకు వాచ్మన్ అవసరం. వీరికి వేతనాలు, మోటర్ల, పంపుల, ఎలక్ట్రికల్ పనులకు ఏటా రూ.5 కోట్ల వరకు భారం పడనుంది. వేతనాలకు సుమారుగా రూ.3 కోట్లు, 49 ఎత్తిపోతల మోటర్ల మర్మతులు, సబ్స్టేషన్ల నిర్వహణ, నియంత్రికల ఏర్పాటు వంటి వాటికి ఏటా రూ.కోటి నుంచి రూ.కోటిన్నర అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో నల్గొండ జిల్లా పరిధిలో 31 ఎత్తిపోతలు.. వాటి కింద 44,783 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 18 ఎత్తిపోతలకు 37,058 ఎకరాలు ఖమ్మం జిల్లా చెరువుమాధవరం ఎత్తిపోతల పథకం కింద 4,800 ఎకరాల ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు ఏర్పాటుచేశారు. వీటిలో 10 ఎత్తిపోతలు కుడివైపు 39 ఎడమ వైపు ఏర్పాటు చేశారు. ఎల్-4, 5, ఎల్-8, 9ఏ, ఎల్-11, 12, ఎల్-15, 16 ఎల్-18, 19, ఎల్ 22, 23, ఎల్-25, 26, ఎల్-30, 31 ఒకే చోట ఏర్పాటు చేశారు. ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తే ఎంత మొత్తం ప్రభుత్వంపై భారం పడుతుందో సిబ్బందికి వేతనాలు, మోటర్ల నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని ఎత్తిపోతల నిర్వహణకు 215 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. సుమారు రూ.3.5 కోట్ల వేతనాలు చెల్లించాలని అంచనా వేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించారు. ఉన్నతాధికారులు వీటిని తిరస్కరించి సిబ్బందిని తగ్గించాలని వాస్తవ పరిస్థితిని పంపాలని సూచించారు. అనంతరం 135 మంది సిబ్బందితో నిర్వహణ చేపడితే జీతాలకు రూ.2.94 కోట్ల ఖర్చవుతుందని, నిర్వహణకు మరో కోటిన్నర అవుతుందని మరో నివేదిక పంపించారు. నిర్వహణ ప్రభుత్వం చేపడితే సుమారు పది వేల మంది రైతులకు ఊరట లభిస్తుంది