ఇది రద్దుల ప్రభుత్వం
విశాఖపట్నం డిసెంబర్ 10.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను రద్దు చేస్తూ రద్దులు ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పథకాలను , ప్రస్తుత ప్రభుత్వం ఆరు నెలలుగా నిలిపివేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రి సమస్యల కోసం శాసనసభలో ప్రస్తావిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆస్పత్రి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్యేకు ఏమైనా దమ్ముంటే 150 పడకల్ని 200 పడకలుగా అప్ గ్రేడ్ చేయాలని ఆయన సవాలు విసిరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించిన పనులను, ప్రస్తుత ప్రభుత్వం ఆరు నెలలుగా నిలిపివేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు సైతం ఇదే పరిస్థితులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు రేట్లు పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేదలపై సుమారుగా వెయ్యి కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో హుందాగా వ్యవహరించాల్సిన స్పీకరు, దానికి భిన్నంగా రోడ్డు మీద వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉన్నత పదవుల కోసం ఇలాంటి చౌకబారు పనులు చేయడం విడ్డూరంగా ఉందని అయ్యన్న ఎద్దేవా చేశారు.