త్వరలో మహారాష్ట్ర కేబినెట్ ఏర్పాటు
ముంబై, డిసెంబర్ 11
మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరి రెండు వారాలు అవుతోంది. శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరగా.. సీఎంగా ఉద్దవ్ థాకరే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఏ పార్టీ సభ్యులకు ఏయే మంత్రిత్వ శాఖలు కేటాయించాలనే అంశంపై గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం సీఎం ఉద్దవ్ థాకరేతో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు బాలసాహెబ్ థోరత్ కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటికే సీఎం పదవిని దక్కించుకున్న శివసేన కీలకమైన హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖలను దక్కించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీకి ఆర్థిక శాఖ, గృహ నిర్మాణ శాఖ, కాంగ్రెస్ పార్టీకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కీలకమైన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏ పార్టీకి వరిస్తుందో తెలియాల్సి ఉంది. మొత్తానికి మహారాష్ట్రలో త్వరలోనే మంత్రివర్గం కొలువుదీరనుంది.