నమ్ముకొన్నోళ్లకు పెద్ద పీట
విజయవాడ, డిసెంబర్ 14
వైసీపీ నిండుకుండలా మారుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో పాటు మధ్యలో వచ్చి చేరిన వారితో పార్టీ నిండిపోయి ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పోటీపడే.. గతంలో పోటీ చేసిన వారు… మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు నుంచి నలుగురు వరకు ఉండటం గమనార్హం. ఇలా ముఖ్యమైన నేతలందరికీ సమన్యాయం చేయడం అన్నది ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్కు కత్తిమీద సవాల్గా మారింది. అయితే పక్కా వ్యూహం…రాజకీయ చతురతతో చంద్రబాబుకు సైతం ఔరా అనిపిస్తున్నారట సీఎం జగన్మోహన్రెడ్డి. ఎక్కడా పార్టీ నేతల మధ్య విబేధాలు రాకుండా చూసుకుంటుండటం పార్టీ నేతలు ఆయన్ను మెచ్చుకునేలా చేస్తున్నారు.లెక్కకు మిక్కిలిగా ఆశావహులున్నపుడు సహజంగానే లుకలుకలు ఆరంభమవుతాయి. దీనికి తోడు కొత్తనీరు రాగానే పాతనీరు పల్లానికి ప్రవహించడం సహజంగా సాగే ప్రకృతి ధర్మం. ఇదే సూత్రాన్ని ఎన్నాళ్లుగానో తమ రాజకీయ అవసరార్థం పార్టీ అధినేతలు పాతవారిని పక్కకు పెట్టిన సంఘటనలు కొకొల్లలు. అందుకు తగ్గట్టుగానే అవసరమైన సమయంలో… నేతలు కూడా ఎలాంటి నైతిక సూత్రాలు పాటించకుండా నిర్మోహమాటంగా హ్యాడిచ్చేస్తున్నారు. చంద్రబాబు చాలా సార్లు ఈ విషయంలోనే ఫెయిల్ అయ్యారు. కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకున్నప్పుడు పాత వాళ్లకు ఆయన భరోసా ఇవ్వకపోవడంతోనే చాలా మంది పార్టీ మారిపోయారు.ఇక అసలు విషయానికి వస్తే కొత్త వారు పార్టీలోకి వచ్చినా పాతవారిని వదులుకోవడానికి గాని పక్కన పెట్టడానికి గాని సీఎం జగన్మోహన్రెడ్డి అంగీకరించడం లేదని సమాచారం. ఇటీవల కృష్ణాజిల్లా రాజకీయాల్లో జరిగిన రెండు పరిణామాలను ఇందుకు ఉదాహారణగా పార్టీశ్రేణులు చూపుతున్నారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే కొన్ని పరిణామాల తర్వాత వంశీ వైసీపీలోకి వచ్చేయడానికి రెడీ కావడంతో యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ఇష్టపడలేదట. అంతేకాదు ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా ? అన్నది కూడా ఆలోచిద్దామంటూ స్పష్టం చేయడం గమనార్హం. అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని విధాలా అండగా ఉన్న యార్లగడ్డ ముఖ్యమని చెప్పేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావుని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించడాన్ని గుర్తు చేస్తున్నారు.ఇప్పుడు ఆయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవి కూడా ఇస్తారని అంటున్నారు. యార్లగడ్డకు ఈ పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారన్న వాదన వైసీపీ నేతల నుంచి వినిపిస్తోంది. ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించడం గమనార్హం. టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఫార్ములాను జగన్ రాష్ట్రం అంతటా వర్తింప చేస్తారట.