రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రెచ్చగొడుతున్నారు : మోడీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 17,
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోదీ.. పౌరసత్వ బిల్లు వల్ల ఏ మతస్థులకు ప్రమాదం ఉండదన్నారు. గతంలోనూ ఈ విషయాన్ని చెప్పాను, ఇప్పుడు కూడా స్పష్టం చేస్తున్నానన్నారు. క్యాబ్ వల్ల ఏ మతస్థుడి పౌరసత్వంపై ప్రభావం ఉండదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మోదీ విమర్శించారు. వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ప్రేరేపిస్తున్నదని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వలలో విద్యార్థులు పడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ విలువ మీరు తెలుసుకోవాలి, విద్యాసంస్థల విలువ తెలుసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచన చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను చర్చించాలి, వాటిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవాలన్నారు. మా ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను ఆలకిస్తుందని మోదీ తెలిపారు. అర్బన్ నక్సల్స్ ఉచ్చులో విద్యార్థులు పడకూడదని ఆయన అన్నారు.