టీడీపీలోనూ.... క్యాపిటల్ పంచాయితీ
కర్నూలు, డిసెంబర్ 18,
ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. జగన్ ప్రకటనపై టీడీపీ, జనసేనలు భగ్గుమంటుంటే.. కొన్ని పార్టీలు మాత్రం స్వాగతించాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనపై మండిపడుతుంటే.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం స్వాగతించారు. కర్నూలును జ్యుడిషియల్ కేపిటల్గా ప్రకటించడంపై కేఈ స్పందించారు.కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను అన్నారు కేఈ. తాను మొదటి నుంచి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుకున్నానని చెప్పుకొచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే కోరానని.. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి అవకాశం ఉందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.కేఈ మాత్రమే కాదు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాను అన్నారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం అని అభిప్రాయపడ్డారు.ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలు జ్యుడిషియరీ కేపిటల్ ఉండొచ్చన్నారు. అయితే రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు.