ఏపీలో చర్చకు దారి తీస్తున్న సీఏఏ
విజయవాడ, డిసెంబర్ 19
రాజకీయాల్లో ఉన్న వారు వేసే ప్రతి అడుగూ కీలకమే. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. తీవ్ర ఇబ్బంది పడటం ఖాయం. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఏపీ సీఎం జగన్కు కూడా ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. ఆయన వేసిన ఒకే ఒక్క అడుగు కొంత ఆలస్యంగానైనా ఇబ్బంది పెడుతోందని చెబుతున్నా రు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. ఇప్పటికే ఉన్న భారత పౌరసత్వ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రెడీ అయింది.దీనిలో భాగంగా.. వివిధ దేశాల నుంచి వలస దారులుగా వచ్చే ముస్లింయేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ.. మోడీ ప్రభుత్వం ఇటీవల లోక్సభలో బిల్లును ప్రవేశ పెట్టింది. లోక్ సభలో అవసరమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో మోడీ సర్కారు ఈ సాహస బిల్లుకు అడుగులు ముందుకు వేసింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ఎంపీలు అందరూ కూడా చాలా ఆలోచించి ఈ బిల్లుపై జరిగిన చర్చలోను, తదుపరి ఓటింగ్లోనూ పాల్గొని మద్దతిచ్చేవారు ఇచ్చారు. ఇవ్వని వారు ఎందుకు ఇవ్వలేదో వివరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ విముఖత వ్యక్తం చేశారు.పౌరసత్వ బిల్లుకు తాము మద్దతిచ్చేది లేదన్నారు కేసీఆర్. కానీ, ఇదే విషయంలో జగన్ తరపున ఎంపీలు దూకుడు ప్రదర్శించారు. పౌరసత్వ బిల్లుకు కోరకుండానే ఎంపీలు లోక్సభలో మద్దతు ప్రకటించారు. ఇది గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఇది జరిగి నాలుగు రోజులు గడిచిన తర్వాత ఏపీలో దీని తాలూకు పర్యవసానాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లోకానీ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీ మైనార్టీలకు టికెట్ ఇవ్వడంలేదు. ఇదే క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చి భారత్లో తలదాచుకునే ముస్లింలకు పౌరసత్వం ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టిందిఇది మైనార్టీలకు తీవ్ర శరాఘాతం.ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చి జీవిస్తున్న ముస్లింలున్నారు. వారిలో బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, అఫ్ఘాన్ తదితర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరంతా కూడా దేశం విడిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి బిల్లుకు జగన్ పార్టీ మద్దతివ్వడంపై కొంత ఆలస్యంగా ఏపీలోని ముస్లింలు కదం తొక్కారు. గుంటూరు, కర్నూలు ల్లోని మైనార్టీ వర్గాలు, విద్యార్థులు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు దిగుతున్నారు. మరి జగన్ ఆలోచించే మద్దతిచ్చారో.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుంటాననే ధైర్యంతో ఇచ్చారో.. తెలియదుకానీ, ఏపీలో మాత్రం వైసీపీకి ఇప్పుడు ఆత్మరక్షణ పరిస్థితి మాత్రం ఎదురుకావడం గమనార్హం. అయితే ఇదే బిల్లుకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతివ్వడం గమనార్హం. అందువల్ల జగన్ కు పెద్దగా ఇబ్బందులుండకపోవచ్చంటున్నారు.