మొదటి వారంలో మున్సిపల్ నోటిఫికేషన్
విజయవాడ, డిసెంబర్ 19
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తును పురపాలకశాఖ ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ విడివిడిగా 131 ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలోనే వార్డుల వారీగా ఎలక్టోరల్స్ రోల్స్, బీసీ ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది అంటే.. 2020 జనవరి మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. జనవరి నెలాఖరు కల్లా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో కొత్త పురపాలక మండళ్లు ఏర్పడనున్నాయి. అయితే, సంక్రాంతికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇటీవల కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఏఏ చట్టం, ఎన్ఆర్సీ వ్యవహారంలో కేంద్రంపై వ్యతిరేకత ఉండగా, రాష్ట్ర భాజపాకు ఇది ప్రతికూలాంశమని అంటున్నారు. ఇదే సమయంలో ఇటీవల జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ టీఆర్ఎస్కు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొనేందుకే వీలైనంత త్వరగా పురపాలిక ఎన్నికలను పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపడంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక అనంతరం ప్రక్రియ ఊపందుకుంది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావించింది. కానీ, రిజర్వేషన్ల వ్యవహారం, వార్డుల విభజన వంటి సమస్యలతో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది.తెలంగాణలో జీహెచ్ఎంసీ సహా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2014 నాటికి రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలు మాత్రమే ఉండేవి. తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా, ఆ తర్వాత మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు.