అమరావతికి భారీగా బలగాలు ....ఏపీ రాజధాని మార్పుపై త్వరలో కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానుంది. దీంతో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులు భారీగా తరలివస్తున్నారు. గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అంబటినగర్(యర్రబాలెం) లోని ఓ కళ్యాణ మండపంలో సుమారు 300 మంది పోలీసులకు వసతి ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు రోజున రాజధానిపై సీఎం జగన్ బాంబు లాంటి వార్త తెలిపారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలును ఏపీ రాజధానులుగా చేస్తామని ప్రతిపాదించారు.స్వయాన సీఎంయే ఏపీకి మూడు రాజధానలంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. గత ఆరు రోజులుగా రాజధాని రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అన్నదాతలకు, విద్యార్థులు , విజయవాడ న్యాయవాదులు సైతం మద్దతు తెలిపారు. మూడు రాజధానులు వద్దు... అమరావతియే ముద్దంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఏపీలో రాజధాని రగడ చోటు చేసుకుంది. మరోవైపు ఇప్పటికే రాజధాని ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రైతుల నిరసనల్ని ఎక్కడికక్కడ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అన్నదాతలు మాత్రం ప్రాణాలైన అర్పిస్తాం, అమరావతిని సాధిస్తాం అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. రాజధాని ఏర్పడితే పిల్లల భవిష్యత్తు బంగారమౌతుందని తల్లి లాంటి పొలాలను రాజదానికి పూలింగ్లో ఇచ్చామని, రాజధానా తరలిపోతుంటే చూస్తూ ఊరుకోమంటూ ఇల్లు వదిలి కుటుంబాల్లో పిల్లలతో సహా ఆడ, మగ, పిల్ల, పెద్ద తేడా లేకుండా ఆందోళనకు దిగారు. రోడ్ మీదే వంటా వార్పు కార్యక్రమం పెట్టారు