YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Highlights

  • ముగిసిన బ్రహ్మోత్సవాలు
  • సాంస్కృతిక కార్యక్రమాలు : 
వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.ముందుగా ఉదయం 7 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.ఉదయం 11.30 గంటలకు స్వామివారు శ్రీగోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్‌ తోటకు వేంచేశారు. సాయంత్రం 4 గంటలకు అక్కడినుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీకోదండరామాలయానికి చేరుకున్నారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. రాత్రి 7.30 నుండి  8 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు : 
ఈ  బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీతసభ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీమునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
 

Related Posts