మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్పవార్ కీలక పాత్ర పోషించారని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. ముంబైలోని వసంత్దాదా షుగర్ ఇన్సిటిట్యూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమకు తక్కువ సీట్లున్నప్పటికీ(శివసేన) ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శరద్పవార్ వ్యూహం రచించారని తెలిపారు. భూమి తక్కువగా ఉన్నా... వ్యవసాయ ఉత్పాదకత ఎలా పెంచాలో నేర్పిన పవార్.. అదేవిధంగా తక్కువ సీట్లున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారని వ్యాఖ్యానించారు.
కాగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి... 169 మంది సభ్యుల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిద్దాంతపరంగా శివసేనతో జతకట్టడానికి కాంగ్రెస్ వెనుకంజ వేసినా ఇరువర్గాలకు సంధి కుదర్చడంలో శరద్పవార్ సఫలమయ్యారు. కామన్ మినిమమ్ ఎజెండాతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే బీజీపీ మాత్రం.. తమతో కలిసి సీట్లు గెలుచుకున్న శివసేన.. ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.