YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

తిరుప్పావై పదకొండోవ రోజు పాశురము*

తిరుప్పావై పదకొండోవ రోజు పాశురము*

తిరుప్పావై పదకొండోవ రోజు పాశురము*
*పాశురం*
   *కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు*
    *శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్*
    *కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే*
    *పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్*
    *శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్*
    *ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*
    *శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ*
    *ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.*
భావం:
ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు. *అవతారిక :అన్ని విషయములందును, అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని, యీ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే యీ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను, భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ వుండరాదని యీమె భావన. అందువల్ల యీమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు. కనపడవు. పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు యీమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన యీమెను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు.  
*(శుద్ధ సావేరిరాగము - ఝంపెతాళము)*
ప..    మాటాడవేలనే? ఓ చిన్నదాన?
    ఇటు నిదుర వీడవు! తామస మదేలనే?
అ..ప..    ఇటు వినవదేలనే? మా కృష్ణ గీతముల!
    పటువైన శ్రీకృష్ణ సంశ్లేష మోహమా?
1. చ..    ఈ గో సమూహముల గాచు వీరెల్లరు
    తగిన వీరులు శత్రు సైన్యాల నణతురు
    బంగారు లతవె! గోపాల కుల తిలకమా!
    అంగనా లేవనే! ఓ చిన్నదాన!
2. చ..    చెలియలందరు వచ్చి నీ వాకిట న్నిలిచి
    నీలమేఘశ్యాము తిరు నామములు పాడ
    ఏల కదలక యుంటివో వనమయూరీ!
    ఏల మాటాడవో అహినితంబా! సఖీ!
    మాటాడవేలనే? ఓ చిన్నదాన?

*తిరుప్పావై ప్రవచనం‎ -  ‎11 వ రోజు*
భగవంతుడు వశమైయ్యేది భక్తి సౌందర్యం తోనే*
*ఆండాళ్ తిరువడిగళే శరణం*    
*11 వ పాశురము*
*కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు* 
*శెత్తార్ తిఱల్ అరియ  చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం*
*కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం  పొఱ్కొడియే*
*పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్*
*శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు  నిన్-*
*ముత్తం పుగుందు ముగిల్  వణ్ణన్ పేర్-పాడ*
*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-*
*ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్*
గోపికలు *"యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే"* అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన  భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు. ఇవాలటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం. ఈవాలటి గోప బాలికకు అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోప బాలిక.  భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి,  ఈవిడని తీసుకొని వెళ్తే  శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోప బాలికను లేపుతుంది. *"కత్తుకఱవై"* దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే  *"క్కణఙ్గళ్"* గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల  *"పలకఱందు"* పాలు పితకటంలో నేర్పరులు.  *"శెత్తార్ తిఱల్ అరియ"*  శత్రువుల బలం నశించేట్టుగా *"చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం"*  వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, *"కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం"* ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది.  శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన  *"పొఱ్కొడియే"*  బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ.  శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటె అది సౌందర్యం అంటారు, అదే సామూహికంగా పాదాది కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు.మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. *"పుత్తరవల్ గుల్ "* తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా  చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, *"పునమయిలే"*  ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. *"పోదరాయ్"* రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం. *"శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు"* ఈ చుట్టూ ఉండే  చెలికత్తెలు అందరూ వచ్చి, *"నిన్-ముత్తం పుగుందు"* నీ ముంగిట ప్రవేశించి,  *"ముగిల్ వణ్ణన్ పేర్-పాడ"*  నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మెం కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, *"శిత్తాదే"*  ఉలుకు లేదు  *"పేశాదే"* పలుకు లేదు  *"శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా  *"నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్"* లేకుంటె ఎందుకు పడుకున్నావు  అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.

Related Posts