YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

పాకిస్తాన్  నుంచి చొచ్చుకొస్తున్న మిడతలు

పాకిస్తాన్  నుంచి చొచ్చుకొస్తున్న మిడతలు

పాకిస్తాన్  నుంచి చొచ్చుకొస్తున్న మిడతలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 27 
దేశంలో అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ నుంచి నిరంతరం ఉగ్రమూకలు చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇప్పుడు వారితోపాటు మిడతలు కూడా సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. మిడతలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి 11 బృందాలను గుజరాత్‌కు పంపింది. కొద్ది రోజులుగా పాక్ నుంచి దండెత్తి వస్తున్న మిడతలు బనస్కాంత, మెహసనా, కచ్‌, పఠాన్‌, సాబర్కాంత జిల్లాల్లో ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంపలు, గోధుమ, పత్తి, జట్రోఫా లాంటి పంటలను నాశనం చేస్తున్నాయి.ఒక్క బనస్కాంత జిల్లాలోనే 5 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిళ్లింది. గుజరాత్ చేరుకున్న కేంద్ర బృందాలు క్రిమిసంహారక మందులు చల్లించడం సహా అన్ని చర్యలనూ చేపడతాయని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం సహా అనేక మార్గాలను పరిశీలిస్తున్న అధికారులు.. పొలాల్లో టైర్లను మండించడం; డప్పులు మోగించడం, పొలాల వద్ద టేబుల్‌ ఫ్యాన్‌లు పెట్టడం, లౌడ్‌ స్పీకర్లతో సంగీతాన్ని వినిపించడం ద్వారా మిడతలను చెదరగొట్టాలని రైతులకు ఇప్పటికే సూచించారు. అయితే వీటితో పెద్దగా ఫలితం ఉండటంలేదు.ఈ అంశంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ.. బనస్కాంత జిల్లాలో 1,815 హెక్టార్లలో క్రిమిసంహారక మందులను చల్లించినట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన బృందాలతోపాటు రాష్ట్ర అధికారులు సైతం వాటిని పారద్రోలే పనిలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. మిడతల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని, ఇప్పటివరకూ 25 శాతం మిడతలను నిర్మూలించినట్టు అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో పూర్తిగా వాటి బెడదను తొలగిస్తామని అధికారులు వెల్లడించారు. మిడతలు దాడిచేసిన పంటలపై క్రిమిసంహారక మందులను చల్లించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫల్దూ వివరించారు.కాగా, దాదాపు దశాబ్దం తర్వాత మిడతల దండు గుజరాత్‌పై దాడి చేసింది. ఆఫ్రికాలోని సూడాన్‌, ఎరిత్రియాల నుంచి బయలుదేరిన ఈ మిడతలు సౌదీ అరేబియా, ఇరాన్‌ గుండా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాయి. సింధ్‌ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం నుంచి భారత్‌లో గుజరాత్ చేరాయి. తొలుత ఇవి బనస్కాంత జిల్లాలోని సుయిగామ్, దాంతా, దేశ, పలన్‌పూర్ గ్రామాల్లోకి ప్రవేశించి, మెల్లగా మెహసనా జిల్లాకు విస్తరించాయి.ఈ మిడతలకు ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఒక్కో దండు విస్తృతి ఏకంగా 30 నుంచి 35 చదరపు కిలోమీటర్ల మేర ఉంటోంది. గుజరాత్‌లో ఈసారి నైరుతి రుతుపవనాలు ప్రభావం ఎక్కువ కాలం కొనసాగడంతో మిడతలు అక్కడే తిష్టవేశాయి. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలోనూ ఇవి ప్రవేశించాయి. మిడతల రాకపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) హెచ్చరికలు చేసినా స్థానిక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఉత్తర గుజరాత్‌ ప్రాంతంపై నెల రోజుల వ్యవధిలోనే మిడతలు రెండోసారి దాడిచేశాయి

Related Posts