10వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి డిసెంబర్ 27
రాజధానిని తరలించవద్దన్న రైతుల అందోళనలు పదవ రోజుకు చేరాయి. అన్నదాతల ఆగ్రహావేశాలతో అమరావతి అట్టుడుకుతోంది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం దృష్ట్యా ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. తుళ్లూరు మండలం లోని అన్ని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రతి గ్రామ కూడలిలో ముళ్ల కంచెలు సిద్ధం చేసి ఉంచారు. సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. తుపాకులు, లాఠీ చార్జ్ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరించాయి. రాజధాని గ్రామాల్లో అప్రకటిత యుద్ధ వాతావరణం తలపిస్తోంది. గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రైతులు మండిపడుతున్నారు. సచివాలయం వెళ్లే ప్రధాన రహదారి కావటం తో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకోంది. పదవ రోజూ రహదారిపై మహాధర్నా కొనసాగించాలని రైతుల నిర్ణయించారు. సచివాలయం వైపు ఎవరినీ అనుమతించలేదు. మందడం వద్ద రైతులు ధర్నాకు కూర్చోకుండా భారీగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.