శివారు మున్సిపల్ కార్పొరేషన్లలో మొదలైన రాజకీయ వేడి
హైదరాబాద్ డిసెంబర్ 27
దశాబ్ద కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికలకు నగారా మోగడంతో శివార్లలో రాజకీయ వేడి మొదలైంది. సాధారణంగా రిజర్వేషన్లు పూర్తయిన తరువాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. కానీ.. ఈ సారి అందుకు భిన్నంగా ముందే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. శివారు కార్పొరేషన్లైన బోడుప్పల్, ఫిర్జాదిగూడలకు ఎన్నికలు నిర్వహించక దాదాపు దశాబ్ద కాలం గడిచింది. ఐదు గ్రామ పంచాయతీలుగా ఉన్న బోడుప్పల్, చెంగిచర్ల, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్లకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండానే బోడుప్పల్, చెంగిచర్లను కలిపి ఒక మున్సిపాలిటీగా, మిగతా మూడు గ్రామాలను కలిపి ఒక మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించినప్పటికీ కోర్టు కేసులతో కమిషనర్ల పాలనతో కొనసాగింది. అనంతరం మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చడంతో ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆశావహులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికంగా పోటీ పడుతున్నారు. జంట కార్పొరేషన్లలో మొత్తం 54 వార్డులు ఉండగా ఆశావహులు మాత్రం వందల సంఖ్యలో ఉన్నారు. దీంతో పార్టీ టికెట్లు ఎంత మందికి వస్తాయో, ఇండిపెండెంట్గా ఎంత మంది బరిలో ఉంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచే దాదాపు 200 మందికిపైగా నాయకులు టికెట్ల కోసం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలను కలిపితే ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. రిజర్వేషన్ ప్రాతిపదికన 54లో సగం 27 సీట్లను మహిళలకు కేటాయించాల్సి ఉంది. మిగతా 27 సీట్లను పురుషులు దక్కించుకోనున్నారు.