ఎన్నార్సీ కి వ్యతిరేకంగా ముస్లీంల ర్యాలీ
ఒంగోలు డిసెంబర్ 28
పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మీర్సా బాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్నార్సీ సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ప్రకాశంజిల్లా పర్చూరులో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముస్లింలు భారతదేశంలో అంతర్భాగమని వారి పట్ల వివక్ష చూపడం దారుణమని, ఓట్ల రాజకీయం కోసం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ముస్లింలకు ఇబ్బంది కలిగించే పౌరసత్వ బిల్లును అమలులోకి తీసుకురావటం దురదృష్టకరమని, దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బిల్లును ఉపసంహరించేలా వత్తిడి తేవాలని, ఈ సందర్భంగా మాట్లాడిన ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. పర్చూరులోని మసీదు వద్దనుండి రెవెన్యూ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి మోడీ హటావో, భాజాపా హఠావో అంటూ నినాదాలు చేశారు. రెవెన్యూ కార్యాలయంలో ఉపతహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.