మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్
ముంబై, డిసెంబర్ 30,
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే అజిత్ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్ నెలలో బీజేపీ మద్దతుతో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్.. ఇప్పుడేమో మహావికాస్ అగాడి మద్దతుతో ప్రమాణం చేశారు. శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ నేతృత్వంలో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన విషయం విదితమే. నవంబర్ 28న శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే.నవంబర్ 28వ తేదీ కంటే ముందు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్షకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ముందే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవీస్ రాజీనామా కంటే ముందే కుటుంబ సభ్యుల బుజ్జగింపులతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సారథ్యంలో ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నాడు డిప్యూటీ సీఎంగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు.నవంబర్ 28న ఉద్ధవ్ థాకరేతో పాటు మంత్రులుగా బాలసాహెబ్ థోరత్, నితిన్ రౌత్(కాంగ్రెస్ నాయకులు), ఏక్నాథ్ షిండే, శుభాష్ దేశాయి(శివసేన నాయకులు), జయంత్ పాటిల్, చగన్ భుజ్బాల్(ఎన్సీపీ నాయకులు) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో 43 మంది మంత్రులుగా ఉండాలి.