గవర్నర్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ
హైద్రాబాద్, డిసెంబర్ 31,
తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిశారు. శనివారం (డిసెంబరు 28) జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీకి తమకు అనుమతి ఇవ్వలేదని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్పై ఫిర్యాదు చేశారు. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ చేపట్టిన ర్యాలీకి అనుమతించిన పోలీసులు తమకు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో సీనియర్ నాయకులు వీహెచ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్ రెడ్డి, జానా రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘1885 డిసెంబరు 28న కాంగ్రెస్ ఆవిర్భవించిన రోజు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ వేడుకలు జరిగాయి. అన్ని రాజధానుల్లో కాంగ్రెస్ జెండా ఎగువేసి, ప్రధాన రహదారులపై శాంతియుత ర్యాలీ చేపట్టాయి. కానీ, హైదరాబాద్లో మేం వారం క్రితం 28న చేపట్టే శాంతియుత ర్యాలీ కోసం పోలీసులను అనుమతి కోరాం. వాళ్లు వారం తర్వాత పర్మిషన్ ఇవ్వము అని సమాధానం ఇచ్చారు. సరే, హైదరాబాద్లో ఎక్కడైనా అనుమతి ఇవ్వాలని తిరిగి మేం కోరాం. దానికి జవాబు రాలేదు. 28న గాంధీభవన్లో జెండావిష్కరణ తర్వాత అనుమతి నిరాకరణకు నిరసనగా మా ఆఫీసులోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టాం.’’‘‘సీఏఏ, పోలీసు దౌర్జన్యం మీద నిరసన తెలిపాం. అదే సమయంలో కమిషనర్తో మాట్లాడితే దురుసుగా మాట్లాడారు. గాంధీ భవన్కు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ హక్కు కమిషనర్కు ఎవరిచ్చారు? ఆంధ్రా కేడర్ ఆఫీసర్ అయిన అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఉన్నతమైన పదవి ఇచ్చింది. దీంతో వారికి జీహుజూర్ అంటూ ఈ కమిషనర్ అణచివేత ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు కమిషనర్ కార్యకర్తలను నిర్బంధించారు.’’కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు? రాష్ట్ర విభజన అనంతరం అంజనీ కుమార్ను ఏపీకి కేటాయించారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ తెలంగాణలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అంజనీ కుమార్ ప్రవర్తనపై విచారణ జరపాలని గవర్నర్ని కోరాం. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ వరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారు. దరుసల్లామ్లో ఎంఐఎంకి అనుమతి ఎలా ఇచ్చారు?’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.