YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు మరిచిపోలేని 2019

జగన్ కు మరిచిపోలేని 2019

జగన్ కు మరిచిపోలేని 2019
విజయవాడ, డిసెంబర్ 31,
జగన్ మోహన్ రెడ్డి.. 2019లో తెలుగునాట మార్మోగిన పేరు ఇది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి భారతీయులే కాదు.. విదేశీయులు కూడా ఆసక్తి చూపారనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో.. జగన్ విజయం సాధించారు. ప్రతిపక్ష నేతగా 2019 సంవత్సరాన్ని ప్రారంభించిన జగన్.. 151 స్థానాల్లో విజయం సాధించి.. బలమైన సీఎంగా అవతరించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు.నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత.. బై బై బాబు, నిన్ను నమ్మం బాబు అనే నినాదాలతో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచగలిగారు. ప్రత్యేక హోదా విషయంలో బాబు పదే పదే మాట మార్చిన తీరును జనానికి అర్థమయ్యేలా చెప్పగలిగారు. రావాలి జగన్, కావాలి జగన్... అంటూ జనం గళం ఎత్తి పలికేలా చేయడంలో వైఎస్సార్సీపీ వ్యూహకర్తలు సఫలీకృతమయ్యారు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన నవరత్నాలు హామీకి మేనిఫెస్టోలో ప్రాధాన్యం దక్కింది. తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తిరిగి తెస్తానని జగన్ ప్రజలకు మాటిచ్చారు.2014 ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికారానికి దూరమైన జగన్.. 2019లో ఎలాంటి తప్పిదానికి ఆస్కారం ఇవ్వలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకున్నారు. ప్రతి ఓటు విలువైందేనని గుర్తించి.. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్నారు. ఎన్నికల ముందు వరకూ ఎక్కడా అలసత్వం వహించలేదు. దీంతో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ సీట్లను వైఎస్సార్సీపీ ఖాతాలో వేసుకుంది. ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. ప్రతి ఇద్దరిలో ఒకరు వైఎస్సార్సీపీకే ఓటేశారు.అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనపై జగన్ తనదైన ముద్ర వేశారు. కీలక నిర్ణయాలను ఎలాంటి సంకోచం లేకుండా తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించారు. అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలను కల్పించి యువతకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం చేశారు. తెలంగాణలో దిశ హత్యాచార ఘటన జరగ్గానే స్పందించిన జగన్.. ఏపీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు.వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అమ్మ ఒడి లాంటి పథకాల అమలు దిశగా ముందుకెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, కంటి వెలుగు తదితర పథకాల అమలుతో.. సంక్షేమమే తారక మంత్రంగా జగన్ పాలన సాగుతోంది.లక్ష కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పిన జగన్.. మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మేరకు అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నారు. అమరావతి ప్రాంత ప్రజల నుంచి ఈ ప్రాతిపాదన పట్ల వ్యతిరేకత వచ్చినా.. మిగతా జిల్లాల నుంచి పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఆందోళనలు చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు ఆయన ఎలాంటి హామీ ఇస్తారో వేచి చూడాలి.స్థూలంగా చూస్తే.. జగన్ 9 ఏళ్ల కష్టనష్టాలకు తెరదించిన ఏడాదిగా 2019ను చెప్పుకోవచ్చు. ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా.. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. జగన్‌ సైతం ఊహించని స్థాయిలో భారీ మెజార్టీని కట్టబెట్టారు. 2019లో ఒక్కటి మినహా జగన్ కోరుకున్న ప్రతీదీ జరిగింది. కేంద్రంలో హంగ్ వస్తే.. 22 ఎంపీ సీట్లతో కీలకంగా మారొచ్చని జగన్ ఆశించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంతోపాటు రాష్ట్రానికి నిధులను రాబట్టుకోవచ్చు అనుకున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ సొంతగానే అధికారంలోకి వచ్చింది. ఇది ఆయన పరిధిలో లేని అంశం. ఓవరాల్‌గా 2019 అనేది జగన్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఏడాది.

Related Posts