చంద్రబాబు ఎదుట కన్నీటి పర్యంతమయిన అమరావతి రైతులు
విజయవాడ జనవరి 1 :
కన్నీళ్లతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టామని రాజధాని గ్రామాల రైతులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. భూములిచ్చి రోడ్డున పడ్డామని, కనీసం కారుణ్య మరణాలకైనా అవకాశం కల్పించాలని వారు కోరారు. ఏ రోజూ కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు, తిండి కూడా తినటం లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రబాలెం రైతుల నిరసన దీక్షకు చంద్రబాబు మద్దతు తెలిపారు.ఆయనతో బాటు ఆయన భార్య భువనేశ్వరి, బావమరిది రామకృష్ణ కూడా ఉన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ సీఎమ్మో విజయసాయి సీఎమ్మో అర్ధం కావట్లేదని రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవటం తగదని ఆయన అన్నారు. అమరావతి 5కోట్ల ప్రజలకు రాజధాని గా కావాలని ఆయన అన్నారు. రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని నందమూరి రామకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు.