టీడీపీలో ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట : ఎమ్మెల్యే గిరి
విజయవాడ, జనవరి 2,
ఇటీవలే సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ను కలిసొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు మరో బాంబు పేల్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. పార్టీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం జగన్ను కలిశానని.. ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు.తాను సీఎంను కలవడాన్ని తప్పుబట్టడం సరికాదన్న మద్దాలి గిరి.. తన అనుమతి లేకుండా నియోజకవర్గానికి మరో ఇంచార్జిని నియమించారన్నారు. సీఎంను కలిసిన తాను స్థానిక సమస్యలను ఆయనకు వివరించానని... బాబుకు రాసిన లేఖలో మద్దాలి గిరి పేర్కొన్నారు. సీఎం వెంటనే స్పందించి రూ.25 కోట్లు మంజూరు చేశారన్నారు. సీఎం దగ్గరకు తాను ఎందుకు వెళ్లానో అడగకుండా.. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు.‘గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఇంఛార్జిని ఎందుకు నియమించలేదు? మరణించిన కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో ఇంచార్జిని ఎందుకు నియమించలేద’ని పార్టీ అధినేతను మద్దాలి గిరి ప్రశ్నించారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన విశాఖ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించిన మద్దాలి గిరి.. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 9 సీట్లను ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అట్టిపెట్టుకుని ఉంటే ఇలాగేనా వ్యవహరించేదని లేఖలో ప్రశ్నించారు.