ఆదుకోని పథకాలు (మహబూబ్ నగర్)
మహబూబ్ నగర్, జనవరి 04: వ్యవసాయానికి చేయూత అందించాలని తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు చేపడుతున్నా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. క్షేత్రస్థాయిలో వివిధ అడ్డంకులు వారికి పథకాలు అందకుండా చేస్తున్నాయి. దీంతో పంటల సాగుకు మళ్లీ అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నిధులు విడుదల చేసినా అందని సాయం : రాష్ట్రం ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయానికి ఆధార్ అనుసంధానం అడ్డంకిగా మారడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం పొందాలంటే వారి ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. దీనికి తోడు రైతుల కోసం ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసినా అవి వారికి చేరడం లేదు. జిల్లాలో మొత్తం రైతు ఖాతాలు 2.18 లక్షలు ఉండగా వాటిలో రెండు లక్షల ఖాతాలకు మాత్రమే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. వీరికి మాత్రమే పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. మరో 16 వేలకు పైబడిన ఖాతాలకు డిజిటల్ సంతకాలు కాలేదు. ఇందులో 9,990 మంది రైతులకు ఆధార్ లేకపోవడంతో పాటు.. వాటిని రైతు ఖాతాలతో అనుసంధానించ లేదు. దీంతో వీరికి ఇప్పట్లో ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం అందే అవకాశం లేదు. రైతుబంధు పథకం కింద అన్నదాతకు ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఖరీఫ్, రబీ రెండు విడతల్లో ప్రభుత్వం అందజేస్తోంది. రైతుబంధుకు గ్రామాల వారీగా బ్యాంకు ఖాతాల నంబర్లు, చరవాణి సంఖ్య, పట్టాదారు పాసుపుస్తకం నకలు సంబంధిత అధికారులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అంతర్జాల వెబ్సైట్లో మండల వ్యవసాయ అధికారులు వివరాలను నవీకరించారు. వీరికి మాత్రమే రైతుబంధు జారీ అవుతోంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పురపాలిక కార్యాలయం, రైల్వే స్టేషన్ రోడ్డు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఈ-సేవ కేంద్రాల్లో ఆధార్ నమోదుకు అన్ని విధాలుగా అవసరమైన సామగ్రి ఉన్నా.. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వీటిలో ఆధార్ నమోదు కొనసాగించడం లేదు. దీంతో ఆయా కేంద్రాల్లో అధికారులు ఆధార్ నమోదును ఎప్పుడు ప్రారంభిస్తారా? అంటూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడు కేంద్రాలు ఆధార్ నమోదు చేయకపోవడంతో కలెక్టరేట్లో ఉన్న శాశ్వత ఆధార్ కేంద్రానికి రద్దీ పెరుగుతోంది.