అమరావతి కి మద్దతుగా విద్యార్థి విభాగం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ
నరసరావుపేట జనవరి 6
రాజధాని అమరావతి కి మద్దతుగా విద్యార్థి విభాగం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, జేఏసీ కన్వీనర్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ జగన్ లాంటి ముఖ్యమంత్రి ని ఇంతవరకూ చూడలేదని అన్నారు. ప్రజలకు నిరంతరం సమస్యలు సృష్టించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు. రైతులను పోలీసులతో వేధిస్తున్నారని రైతుల ఉసురు తగిలి ఆయన గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉందని అరవింద బాబు అన్నారు. ఆ రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని అమరావతి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బీఎస్పీ, విద్యార్థి విభాగం జేఏసీ, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.