మారిన రిజర్వేషన్స్ ..మేయర్లు దారెటు
హైద్రాబాద్, జనవరి 7
ప్రస్తుతం మేయర్లుగా కొనసాగుతూ మళ్లీ ఆ పదవిపై కన్నేసిన వారి ఆశలు మూడు చోట్ల అడియాసలయ్యాయి. రాష్ట్రంలోని ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లకు ఈసారి రిజర్వేషన్లు మారిపోయాయి. సోమవారం విడుదలైన 123 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు రిజర్వేషన్ల జాబితా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గతంలో బీసీ జనరల్కు రిజర్వు కాగా, 2016లో బొంతు రామ్మోహన్ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం అనేక మంది పోటీ పడినా చివరకు అధిష్ఠానం ఆశీస్సులతో రామ్మోహన్కు ఆ అవకాశం దక్కింది. అయితే ఆ స్థానం ఈ సారి జనరల్ మహిళకు రిజర్వు అయింది.గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్లదీ ఇదే పరిస్థితి. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి ఐదేళ్ల క్రితం జనరల్కు రిజర్వ్ అయింది. అయితే బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేందర్ను మేయర్ను చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నరేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో.. ఆయన స్థానంలో ఓసీ అయిన గుండా ప్రకాశ్ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో ఆయన కూడా పదవి కోల్పోనున్నారు. ప్రస్తుతం ఎస్టీ జనరల్గా ఉన్న ఖమ్మం కార్పొరేషన్ మేయర్గా పాపాలాల్ కొనసాగుతున్నారు. కానీ, అది ఈసారి జనరల్ మహిళకు రిజర్వు అయింది.మరో మూడు కార్పొరేషన్లైన నిజామాబాద్, కరీంనగర్, రామగుండంకు రిజర్వేషన్లు గతంలో ఉన్నవే ఉన్నాయి. నిజామాబాద్ మేయర్ పదవి గత ఎన్నికల్లో జనరల్ మహిళకు రిజర్వు కాగా బీసీ వర్గానికి చెందిన ఆకుల సుజాతను మేయర్గా ఎన్నుకున్నారు. తిరిగి ఈ స్థానం బీసీ మహిళకే కేటాయించారు. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్కు కూడా మరోసారి పదవి దక్కే అవకాశం ఉంది. గతంలో బీసీ జనరల్ రిజర్వేషన్ ఈ కార్పొరేషన్కు ఉండగా, ఇప్పుడు కూడాఅదే కేటగిరీకి దక్కింది. రామగుండం కార్పొరేషన్కు కూడా మళ్లీ ఎస్సీ జనరల్ కేటాయించారు. అయితే, పాత రిజర్వేషన్లు దక్కిన కార్పొరేషన్ల మేయర్లకు మరోసారి అవకాశం వస్తుందా, లేదా అన్నది చూడాలి.