రాష్ట్రపతికి వైసీపీ ఎమ్మెల్యే లెటర్
విజయవాడ, జనవరి 7,
రాజధానిని తరలించొద్దని ఆ ప్రాంత రైతులు, టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఒకరు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. అమరావతి రాజ్యాంగబద్ధం కాదని ప్రకటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు రాష్ట్రపతిని కోరారు. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ లేదా ప్రభుత ఆర్డర్ ఇవ్వలేదని ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు.శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా... నాటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ధర్మాన ఆరోపించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిటీ విముఖత వ్యక్తం చేసిందని ధర్మాన గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా చేయాలన్ని నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరిందన్నారు. అత్యంత సారవంతమైన భూములపై రాజధాని నిర్ణయం ప్రభావం ఉంటుందని హెచ్చరించిందన్నారు.ప్రస్తుత ప్రభుత్వం నాటి నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తోందని.. రాజధానిపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ, హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిందని ధర్మాన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమరావతి రాజ్యాంగ విరుద్ధం, అక్రమమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని కోరారు. అమరావతిపై గెజిట్ ఇవ్వలేదు కాబట్టి.. సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన భారత మ్యాప్లో తగిన మార్పులు చేసేలా ఆదేశించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు.కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని అమరాతి ప్రాంత రైతులు ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజధానికి భూములు ఇచ్చిన మా త్యాగాన్ని వైసీపీ ప్రభుత్వం అవహేళన చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.