కేసీఆర్ పిలిచినా కాంగ్రెస్ లోనే ఉన్నా
నల్గొండ, జనవరి 7,
కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని పిలిచినా వెళ్లలేదని చెప్పారు. 2014, 2019 ఎన్నికల సమయంలో గులాబీ దళపతి కేసీఆర్ తనను, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి ఎంపీ)ని టీఆర్ఎస్లోకి రమ్మని పిలిచారని.. అయితే తాము నిరాకరించామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తాము ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు.నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరితే కొంత మంది నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. ఏదేదో మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరుల నీతి, నిజాయితీ రాష్ట్ర ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కార్యకర్తలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత ఏడాది జులై 19న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. అప్పల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూ నిర్వాసితుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం సమర్పించినట్లు వివరించారు. టీపీసీసీ పదవిపై కన్నేసిన కోమటిరెడ్డి సోదరులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే.. ఈ సోదరులిద్దరూ కాంగ్రెస్లో కొనసాగుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!!