టీడీపీ నేతల గృహ నిర్బంధంపై చంద్రబాబు సీరియస్
అమరావతి జనవరి07
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నాయకులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులను అరెస్ట్ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికం : ‘రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. రైతులు, రైతుకూలీలకు మద్దతు చెప్పేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం. వందలాది టీడీపీ నేతల అక్రమ నిర్బంధం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట. రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడం గర్హనీయం. పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరు. అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలి. అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.