అమరావతిలో తీవ్రమవుతున్న ఆందోళనలు
విజయవాడ, జనవరి 10
అమరావతిలో రైతుల ఆందోళలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్లాలని మహిళలు నిర్ణయించారు. ఉదయం తుళ్లూరు, మందడంతో పాటూ రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.. ముళ్ల కంచెలు అడ్డు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు.. ఈ క్రమంలో పలువురు కిందపడిపోయారు. ఈ లాఠీచార్జ్లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. కొంతమంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. మిగిలిన గ్రామాల నుంచి మహిళలు, రైతులు విజయవాడ దుర్గమ్మ చెంతకు బయల్దేరారు.దుర్గమ్మను దర్శించుకోవడానికి వెళుతున్న వారిని అడ్డుకోవడం దారుణమని మహిళలు మండిపడుతున్నారు. తాము దైవ సన్నిధికి వెళుతున్నామని.. ప్రభుత్వంపై యుద్ధానికి కాదన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతికావాలా అంటూ ప్రశ్నించారు. తాము ఏపీలో ఉన్నామని.. పాకిస్థాన్లో కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు మహిళలు పోలీసుల కాళ్లపై పడ్డారు. పోలీసులు మాత్రం వెనక్కు తగ్గలేదు.. అనుమతి లేదని వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు