విశాఖపట్నంలో రిపబ్లిక్ డే ఉత్సవాల్ని విశాఖ ఆర్కే బీచ్లో
విశాఖపట్నంలో రిపబ్లిక్ డే ఉత్సవాల్ని విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి గణతంత్ర దినోత్సవం ఇది. సీఎం హోదాలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అందుకే ఆయన... ఈ కార్యక్రమానికి విశాఖను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై హైపవర్ కమిటీ కూడా నియమించారు. హైపవర్ కమిటీ నివేదిక మరో నాలుగు రోజుల్లో దీనిపై తమ నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 20న ఏపీ అసెంబ్లీ కూడా ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ విశాఖ రాజధానిగా చేయడానికి అన్నివిధాలుగా అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు ఇవ్వడం కోసమే జగన్ ఈ విధంగా విశాఖలో రిపబ్లిక్ డే నిర్వహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.