నేరుగా రంగంలోకి జనసేనాని
ఏలూరు, జనవరి 13,
ఏప్రిల్ ఎన్నికల్లో జనసేన ఎటూ కాకుండా చతికిలపడింది. సాక్షాత్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఒకే ఒక్క సీటు తప్ప అన్నింటా పరాభవం తప్పలేదు. అయినా జనసేనను నడిపించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించడమే ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకమైన పాయింట్. పవన్ కల్యాణ్ పార్టీని గత ఏడు నెలలుగా ఎలాగోలా మోస్తున్నారు. జగన్ ప్రభుత్వం మీద దాదాపుగా ప్రతీ రోజూ విరుచుకుపడుతూ ప్రశ్నిస్తాను అన్న మాటకు ఇపుడు పూర్తిగా కట్టుబడి సాగుతున్నారు. నిజానికి అయిదేళ్ళ టీడీపీ జమానాలో ప్రశ్నించడం అన్నది పూర్తిగా మరచిపోయారనే చెప్పాలి. ఎటూ జగన్ అంటే పెద్దగా పొడ గిట్టదు కాబట్టి పవన్ కల్యాణ్ లోకి ప్రశ్నించే నేత హఠాత్తుగా ఇపుడు బయటకు లేచాడని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో చూసుకుంటే పవన్ కల్యాణ్ రాజకీయంగా సరైన విధానంలో సాగుతున్నాడా అన్నది బయటవారికే కాదు, సొంత పార్టీ వారికి కూడా పెద్ద డౌట్ గా ఉందిటమరో వైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ బీజేపీ మీద పూర్తి పాజిటివ్ గా ఉన్నారు. మాట్లాడితే కేంద్రం అంటున్నారు. నా వెనక పెద్ద శక్తి ఉందని బలమైన వైసీపీ సర్కార్ ని ఒక్కలాగ భయపెడుతున్నారు. నేను కనుక తలచుకుంటే అంటూ గట్టిగా నోరు చేసుకుంటునారు. ఈ మధ్యనే ఆయన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాని కూడా బాగా పొగిడారు. వారిద్దరూ కరెక్ట్ రాజకీయ నేతలంటూ కితాబు ఇచ్చారు. ఇవన్నీ చూసిన వారికి కమలం కంట్లో పడాలని పవన్ కల్యాణ్ వేస్తున్న బిస్కట్లుగా ఇవి కనిపిస్తున్నాయి. పవన్ సైతం ఢిల్లీ తోడు కోసం తన వంతు ప్రయత్నాలు బాగానే చేసుకుంటున్నారన్న ప్రచారమూ ఉంది.కాగ పవన్ కళ్యాణ్ తాజాగా నిర్వహించిన జనసేన పార్టీ పదమూడు జిల్లాల నేతల విస్ల్తుత స్థాయి సమావేశంలో ఏపీలో రాజకీయం, జనసేన పాత్ర, భవిష్యత్తు రాజకీయాల మీద గట్టిగానే చర్చ జరిగిందట. ఈ చర్చలో భాగంగా పార్టీలో ఉన్న నాయకులు బీజేపీతో జట్టు కట్టడం మీద తమ అభ్యంతరాలను బాహాటంగానే పంచుకున్నారుట. బీజేపీకి ఏపీలో అసలే బలం లేదని, అటువంటి పార్టీతో కలసి నడవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని వాదించిన వారూ ఉన్నారట. జనసేన ఏపీలో ఎత్తిగిల్లాలంటే బీజేపీని పక్కన పెట్టడమే మంచిదని సూచించారట.అదే సమయంలో టీడీపీతో కలసి అడుగులు వేయాలని ఎక్కువమంది పవన్ కల్యాణ్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం ఏపీలో బలమైన విపక్షమని, పైగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా జనసేన పట్ల సానుకూలంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారట. నిజానికి జనసేన, టీడీపీ విడిగా పోటీ చేయడం వల్లనే ఏపీలో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కూడా విశ్లేషించారట. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ పొత్తు కొనసాగించాలని, ఆ ఫలితాలను చూసుకుని రానున్న ఎన్నికలకు బాటలు వేసుకోవాలని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కి కూడా పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఆయన చూపు మాత్రం బీజేపీ పైన ఉందని అంటున్నారు. కేంద్రంలో ఆ పార్టీ ఉండడంతో గట్టి అండ కోసమే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. మరి జనసైనికులు చెప్పిన మాట ప్రకారం రాబోయే స్థానిక ఎన్నికలతో టీడీపీతో పవన్ కల్యాణ్ చెలిమి మొదలుపెడతాడేమో చూడాలి.