జిల్లా పార్టీకి నేతలు కావలెను...
తిరుపతి, జనవరి 13,
తెలుగుదేశంలో ఆ పదవి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరి కారణాలు వారివి. దీంతో ఎవరో ఒకరిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పులివర్తి నాని ఉన్నారు. ఆయన ఈ పదవి తనకొద్దు అంటూ అధినేత చంద్రబాబు వద్ద విస్పష్టంగా చెప్పారు.అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు వస్తారు. అదే అధికారం లో లేకపోతే ఆ పదవి తమకు వద్దంటారు. ఎందుకంటే చేతి చలుము వదలడంతో పాటుగా అంతటి బాధ్యతలను మోయడమెందుకన్న భావనలో ఉంటారు. పులివర్తి నాని కూడా చిత్తూరు టీడీపీ జిల్లా అధ్యక్ష్య బాధ్యతను చేపట్టలేనని చంద్రబాబుకు స్పష్టం చేశారు. తాను చంద్రగిరి నియోజకవర్గంలో మరింత పట్టు సాధించాలంటే తనను పదవి నుంచి తప్పించాలని పులవర్తి నాని చంద్రబాబును ఇప్పటికే కోరారు.ఈ పదవిలో మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డిని నియమించాలని చంద్రబాబు తొలుత భావించారు. ఇటీవల చిత్తూరు వచ్చిన సందర్భంగా అమర్ నాధ్ రెడ్డి తో చంద్రబాబు జిల్లా పార్టీ అధ్యక్ష్య పదవి విషయాన్నిి ప్రస్తావించారు. అయితే అమర్ నాథ్ రెడ్డి కూడా చంద్రబాబు ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అవసరమైతే తాను ఎన్నికలకు ఏడాది ముందు బాధ్యతలను తీసుకుంటానని, ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. నిజానికి గతంలో అమర్ నాధ్ రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పనిచేశారు.టీడీపీ అధ్యక్షులుగా పనిచేసిన అనేకమందికి చంద్రబాబు గతంలో ప్రయారిటీ ఇచ్చారు. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన దొరబాబు, శ్రీనివాసులుకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయినా ఈ పదవిని ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీ అధ్యక్షుడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేతలను బాబు బతిమాలాడాల్సిన స్థితి నెలకొంది.