కుల రాజకీయలు చేస్తున్న జనసేన
కాకినాడ జనవరి 13
రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ప్రజల మనోభావాలనే మూడు రాజధానుల సంఘీభావ ర్యాలీలో తాను తెలిపానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్న టీడీపీ తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి జగన్ను నానా దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే స్వయంగా చంద్రబాబు, ఆయన భజనపరులు అసభ్యకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. తన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల కోసం మూడు రాజధానుల ప్రతిపాదన ఆసరాగా ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఎలా సమర్థించారో ప్రజలకు తెలియంది కాదన్నారు. పవన్పై తాను రాజకీయ విమర్శలు చేస్తే కాపు కులస్తులపై చేశానంటూ ఆ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జనసేన నాయకుడు పంతం నానాజీ కాకినాడ సిటీ, రూరల్లో పోటీ చేసి ఏ స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నారో? ఆ సామాజిక వర్గంలో అతని బలమేమిటో అందరికీ తెలుసన్నారు. బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్రంగా జిల్లాలో తొలిసారి అడుగు పెట్టిన దగ్గర నుంచి విద్యార్థి నాయకుడిగా తాను కాపు సామాజికవర్గంతో సాన్నిహిత్యంగా, జక్కంపూడి శిష్యునిగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనను సవాల్ చేసే స్థాయి నానాజీకి లేదన్నారు. తనకు ఉన్న స్నేహితులు, పార్టీ కేడర్లో అత్యధికులు కాపుకులస్తులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కులం పేరుతో ఇంతగా రాజకీయాలు చేస్తున్న జనసేన.. కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ, ఆయన భార్య, కోడలు, కుమారులను చంద్రబాబు సర్కార్ అవమానకరంగా వేధింపులకు గురిచేసినప్పుడు ఎందుకు పత్తాలేకుండా పోయిందన్నారు.