వైసీపీ కార్యకర్తలకు బస్తీమే సవాల్
అనంతపురం, జనవరి 13,
టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లా పాల సముద్రం చేరుకున్నారు.. అక్కడ జోలె పట్టి విరాళాలు సేకరించారు. చంద్రబాబు రాకను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు.ఈ ఉద్రిక్తతలు నడుమ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి బస్సు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎదురు వెళ్లి బస్తీ మే సవాల్ అంటూ హెచ్చరించారు. వారు కూడా వాగ్వాదానికి దిగడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్థిచెప్పడంతో ఉద్రిక్తత సద్ధుమణిగింది. తర్వాత చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది. అనంతరం చంద్రబాబు పెనుకొండకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్షోలో పాల్గొన్నారు.అలాగే చంద్రబాబు సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు. అక్కడ కూడా జోలె పట్టి అమరావతి కోసం విరాళాలు సేకరించనున్నారు. అనంతరం జరిగే బహరింగ సభలో ప్రసంగించనున్నారు. చంద్రబాబు అమరావతి పరిరక్షణ యాత్ర పేరుతో ఐదారు రోజులుగా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.