పోలీసులకు అమరావతి రైతుల షాక్
విజయవాడ, జనవరి 13
అమరావతిలో రైతుల ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇటు పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమల్లోక ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో రైతులు తమకు తోచిన విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఉన్న రైతులు, అమరావతిలో స్థానికులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వారికి ఎవరూ సహకరించకూడదని తీర్మానం చేసుకున్నారు.144 సెక్షన్ కొనసాగిస్తుండటంతో పాకిస్థాన్లో ఉన్నామా.. అమరావతిలో ఉన్నామా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. పోలీసులకు నీళ్లు, టిఫిన్, భోజనం అమ్మకాలు నిలిపివేయాలని కొన్ని గ్రామాలు నిర్ణయించాయి. పోలీసులకు ఎటువంటి విక్రయాలు చెయ్యవద్దని దుకాణ యజమానులకు గ్రామస్థులు చెప్పారు.మందడంలో పోలీసులు రోడ్లపై ఎవరిని తిరగనివ్వడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా, పోలీసులపై కోపంతో.. కొంతమంది యువకులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. గ్రామంలో ఉన్న పంచాయితీ బల్లలపై పోలీసులు కూర్చోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ బల్లలపై మడ్డి ఆయిల్ను పూశారు. ఊరులో తమను కూర్చోనివ్వకుండా.. పోలీసులు మాత్రం హాయిగా కూర్చుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.